“అల్వాల్ డీవీఎంసీ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్.|

0
27

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన నిర్వహించిన డీవీఎంసీ సమావేశంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని పలు కీలక అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గత డీవీఎంసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలను సమావేశ మినిట్స్‌లో సరిగా నమోదు చేయకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా అల్వాల్‌కు చెందిన పద్మిని అజిత్ సాయి కేసు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటాన్ని ప్రస్తావిస్తూ, ఒక ఎస్సీ మహిళకు న్యాయం చేయడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు.

గత సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్న ఎమ్మెల్యే, అల్వాల్, మల్కాజ్‌గిరి, నేరేడ్మెట్, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పునరావృతంగా నమోదవుతున్న కేసులపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

డీవీఎంసీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపై అమలు చర్యలు లేకపోవడంతో సమావేశాలకు ప్రయోజనం లేకుండా పోతోందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుకుదనం చూపాలని స్పష్టం చేశారు.

అల్వాల్ మండలంలోని సర్వే నంబర్లు 582, 583లోని యూఎల్‌సీ భూముల్లో నివసిస్తున్న వడ్డెర కులస్తులు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నోటీసులు జారీ చేయడాన్ని ప్రశ్నిస్తూ, పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని రెవెన్యూ అధికారులకు సూచించారు.

వెంకటాపురం డివిజన్ యాదమ్మనగర్‌లో నెలకొన్న విద్యుత్ సమస్యను ప్రస్తావిస్తూ, అక్కడి ప్రజలకు బల్క్ మీటర్ కేటాయించాలని ఎన్నిసార్లు కోరినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే అంబేద్కర్ నగర్, ఇంద్రనగర్ ప్రాంతాల్లో బెల్ట్ షాపులను తొలగించాలని పలుమార్లు కోరినా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

కొన్ని ప్రాంతాల్లో గంజాయి సేవించే వ్యక్తుల వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇటీవల మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హేమంత్ పటేల్‌పై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే, ఆ కేసును సమగ్రంగా పరిశీలించాలని పోలీసు అధికారులను కోరారు.

బహిరంగ ప్రదేశాల్లో తెలియని వ్యక్తుల మధ్య జరిగే గొడవలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయడం సుప్రీంకోర్టు 31(R) ఆదేశాల ప్రకారం చెల్లదని పేర్కొంటూ, ఈ అంశంపై పునఃసమీక్ష అవసరమన్నారు.

ఈ సమావేశంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్, ఎస్సీ-ఎస్టీ కమిషన్ సభ్యుడు జిల్లా శంకర్, డీవీఎంసీ సభ్యులు బిట్ల వెంకటేశ్వర్లు, రాములు, శరణగిరి, అశోక్ కుమార్, ధనరాజ్ నాయక్, ఏఎస్డబ్ల్యూఓ గోపీచంద్, ఏసీపీ బాల గంగిరెడ్డి, ఏసీపీ యాదగిరి రెడ్డి, ఏసీబీ గోపాలకృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ సుదర్శన్, ఎమ్మార్వోలు, ఎస్‌హెచ్‌వోలు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal