ప్రియుడే హంతకుడా..?
దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య కేసు కొలిక్కి..
ప్రేమ వ్యవహారమే ఘోరానికి దారితీసిందన్న కోణంలో పోలీసుల విచారణ..
మృతురాలి సామాజిక వర్గం నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..
కీలకమైన కాల్ డేటా, ఘటనా స్థల ఆధారాలతో నిందితుడి గుర్తింపు..
అధికారుల అధికారిక నివేదిక రాగానే నేడో రేపో రిమాండ్కు తరలింపు…
భారత్ అవాజ్ న్యూస్:. దుగ్గొండి : మండలంలోని లక్ష్మీపురం శివారులో చోటుచేసుకున్న వివాహిత హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్లు సమాచారం. ఈ కేసులో మృతురాలికి సన్నిహితంగా ఉన్న వ్యక్తినే పోలీసులు ప్రధాన అనుమానితుడిగా గుర్తించినట్లు తెలిసింది. ప్రేమ వ్యవహారమే హత్యకు దారితీసి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలత హత్య కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో సేకరించిన ఆధారాలు, కాల్ డేటా, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా కేసును ఛేదించినట్లు తెలుస్తోంది….
అట్రాసిటీ సెక్షన్ల నమోదుకు సన్నద్ధం…!
మృతురాలు ఎస్సీ వర్గానికి చెందిన మహిళ కావడంతో కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసే అంశంపై పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సంబంధిత రెవెన్యూ అధికారుల నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. బాధితురాలి సామాజిక వర్గానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు మరియు నివేదిక అందిన వెంటనే అట్రాసిటీ సెక్షన్లు చేర్చే అవకాశం ఉందని ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందుతోంది. ఇక పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడిని నేడో రేపో న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్కు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుడి వివరాలను పోలీసులు త్వరలోనే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…









