హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్ ఛాంపియన్షిప్ 2025-26లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్ల మధ్య జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తెలంగాణ జట్టు మొత్తం 12 పతకాలు సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చింది.
ఈ ఛాంపియన్షిప్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు 1 స్వర్ణ పతకం, 4 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.
కఠిన పోటీ మధ్య క్రమశిక్షణ, పట్టుదలతో ఆడి విజయాలు సాధించిన క్రీడాకారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్ ఐపీఎస్ అభినందించి సత్కరించారు.
రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పతక విజేతలకు అభినందనలు తెలిపిన డీజీపీ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో కూడా తెలంగాణ పోలీసులు సత్తా చాటాలని ఆకాంక్షించారు.
పోలీస్ సిబ్బంది విధులతో పాటు క్రీడల్లోనూ రాణించడం గర్వకారణమని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతాయని డీజీపీ పేర్కొన్నారు.
తెలంగాణ పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.
#sidhumaroju









