“బాల్క సుమన్ లొంగిపోయినట్లు ప్రచారం.. అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూపు.|

0
8

హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వచ్ఛందంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు.

ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసు కారణంగానే ఆయన లొంగిపోయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సింగరేణి అంశంపై జరిగిన సమావేశంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

సింగరేణి కార్యాలయాలు, జీఎం ఆఫీసులు, సింగరేణి భవన్‌లను ముట్టడించాలని, ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు, సింగరేణి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

కేసు నమోదు అనంతరం పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బాల్క సుమన్ స్వయంగా నాంపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయనను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

అయితే అరెస్ట్ చేశారా లేదా కేవలం విచారణ కోసం మాత్రమే పిలిచారా అన్న విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు బాల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండగా, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆయనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#sidhumaroju