హైదరాబాద్ : రాజకీయాల్లో పదవులు సంపాదించడం కంటే ప్రజల మనసులు గెలుచుకోవడం గొప్ప విషయం. అలాంటి అరుదైన నాయకుల్లో మాజీ గవర్నర్, సీనియర్ రాజకీయ నాయకులు బండారు దత్తాత్రేయ ఒకరు.
ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ప్రజాసేవ, సామాజిక సేవలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరికీ సంతోషాన్నిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో దత్తాత్రేయ ఒక ప్రత్యేక అధ్యాయం. విద్యార్థి దశ నుంచే ప్రజా జీవితంలో అడుగుపెట్టి, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. పార్టీ బలహీనంగా ఉన్న రోజుల్లోనూ కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తూ, సంస్థాగత నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారు.
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు ప్రజల ఆశీస్సులతో పార్లమెంటుకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రిగా కూడా సమర్థవంతంగా సేవలందించారు. కార్మికులు, పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. అనంతరం గవర్నర్గా బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆయనలోని సాధారణ వ్యక్తి ఎప్పుడూ మారలేదు. ప్రజలతో ఆత్మీయంగా మమేకమవడం, కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా ఆదరించడం ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణాలు.
తెలంగాణ ప్రజలు ప్రేమగా “దత్తన్న” అని పిలవడం వెనుక ఆయన మానవీయత, నిరాడంబరత, ప్రజల పట్ల ఉన్న ఆప్యాయతే కారణం. రాజకీయాలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ప్రజా జీవితంలో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజిక సామరస్యానికి ప్రతీకగా కూడా దత్తాత్రేయ గారు నిలిచారు. ప్రతి ఏడాది విజయదశమి సందర్భంగా ఆయన నిర్వహించే “అలై బలై” కార్యక్రమం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా మారింది.
రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులు, ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర ఆత్మీయతను పెంపొందించే ఈ కార్యక్రమం సమాజంలో సోదరభావం, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చేరవేయడంలో “అలై బలై” విశేష పాత్ర పోషిస్తోంది.
నేటి రాజకీయాల్లో సేవాభావం, క్రమశిక్షణ, నిబద్ధత ఎంత ముఖ్యమో దత్తాత్రేయ జీవితం తెలియజేస్తోంది.
ప్రజా జీవితంలో విలువలను కాపాడుకుంటూ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటే ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చో ఆయన ప్రస్థానం నిరూపించింది. రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా, ప్రజల మనిషిగా ఆయన అందరికీ ఆదర్శప్రాయులు.
ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు మార్గదర్శకులుగా, సమాజానికి స్ఫూర్తిగా కొనసాగాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
— Sidhumaroju










