“అల్వాల్ విషాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్.|

0
8

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన సందీప్, ఆయన కుమార్తె రీతిక కుటుంబ సభ్యులను మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు.

శనివారం తెల్లవారుజామున టెలికం కాలనీలో జరిగిన ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, భార్య కళ్లముందే భర్త, కుమార్తె ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదారక సంఘటన అని పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా ట్రిప్ కావాల్సి ఉన్నప్పటికీ గంటన్నర నుంచి రెండు గంటల వరకు ట్రిప్ కాకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఈటల రాజేందర్ విమర్శించారు.

అత్యవసర ఫోన్ కాల్స్ వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. వర్షాకాలానికి ముందే చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ లైన్ల భద్రతను నిర్ధారించాల్సిన బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వర్తించి ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.

సందీప్ కుటుంబానికి ఆయన ప్రధాన ఆధారమని, ఆయన మృతితో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిందని ఎంపీ తెలిపారు. ఇప్పటికే మృతుడి తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు.

ఈ విషాద ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.

సాధారణ ఎక్స్‌గ్రేషియాకు మించి ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

మృతులిద్దరికీ కలిపి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని, ప్రతి మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

అలాగే సందీప్ భార్యకు జీవనోపాధి కోసం ప్రభుత్వంలో, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో తగిన ఉద్యోగం కల్పించాలని కోరారు.

ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ, జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బొల్లారం డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, వెంకటాపురం శ్రీధర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, సంజయ్, రాజిరెడ్డి, మహిళా నాయకులు సుజాత, కరుణశ్రీతో పాటు అల్వాల్ సర్కిల్‌కు చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal