పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో ఊరట: పోస్టుల తొలగింపు|

0
0

పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట

భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం దావా  

అవమానకరమైన పోస్టులను తొలగించాలని సోషల్ మీడియాకు ఆదేశం

తెలంగాణలోని కోడి చెరువు భూములకు సంబంధించిన వివాదం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రసారమైన కథనాలు, వీడియోలు మరియు పోస్టులను తక్షణమే తొలగించాలని లేదా నిలిపివేయాలని ఎక్స్, గూగుల్, మెటా వంటి సామాజిక మాధ్యమ వేదికలను బెంగళూరు న్యాయస్థానం ఆదేశించింది.

 

తెలంగాణలోని కోడి చెరువు భూ వివాదానికి సంబంధించి తనపై వస్తున్న అసత్య ఆరోపణలపై పవన్ కల్యాణ్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారించిన కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న నిర్దిష్ట యూఆర్‌ఎల్‌లతో పాటు, అజ్ఞాత ఖాతాల నుంచి వచ్చే ఇటువంటి పోస్టులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ కోర్టు “జాన్ డో” (John Doe) ఉత్తర్వులు ఇచ్చింది.

 

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని కోడి చెరువు భూములను పవన్ కల్యాణ్ కబ్జా చేశారని, భూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తూ మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ దుష్ప్రచారంపై పవన్ కల్యాణ్ న్యాయపోరాటం ప్రారంభించారు. బుధవారం ఈ కేసును విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది.