ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.|

0
0

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: జిల్లాలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పారదర్శకంగా కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని వారు కలెక్టర్‌ను కోరారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

జి.ఓ. ఎం.ఎస్. నెం.166 ప్రకారం సర్వే నెం.278లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి తిరస్కరించబడిన దరఖాస్తులను పునఃపరిశీలించాలని, మల్కాజిగిరి నియోజకవర్గంలోని భూదాన్ భూముల్లో గృహ నిర్మాణ పథకాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా ప్రభావితమవుతున్న హిందూ దేవాలయాలను తగిన ప్రదేశాల్లో పునర్నిర్మించాలని, ఆల్వాల్ మీ సేవా కేంద్రం రోడ్డు విస్తరణలో కోల్పోతున్న నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో నూతన మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణ తల్లి విగ్రహం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు, ఇటీవల వెంకటాపురం డివిజన్ టెలికాం కాలనీలో విద్యుత్ షాక్ కారణంగా మృతి చెందిన తండ్రి, కుమార్తె కుటుంబ సభ్యులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాల్లో ప్రస్తావించిన అంశాలపై జిల్లా కలెక్టర్ మను చౌదరి సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal