“HMWSSB ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా రావడం లేదని కె. శ్రీనివాస్ వర్మ ఆరోపణ.”
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ ప్రాంత ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ ఆరోపించారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, HMWSSB ద్వారా బుక్ చేసుకున్న నీటి ట్యాంకర్లు వారానికి ఒకసారి కూడా సకాలంలో అందడం లేదని అన్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో ప్రైవేట్ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రోజువారీ నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ప్రజల దాహం తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని శ్రీనివాస్ వర్మ విమర్శించారు. సరైన ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అన్నారు.
ఇంకుడు గుంతల ఏర్పాటుపై నిర్లక్ష్యం, చెరువుల పూడికతీత చేపట్టకపోవడం వల్ల అల్వాల్తో పాటు హైదరాబాద్లోని అనేక కాలనీల్లో భూగర్భ జలాలు అడుగంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని, HMWSSB ద్వారా నీటి ట్యాంకర్ల సంఖ్యను వెంటనే పెంచాలని శ్రీనివాస్ వర్మ డిమాండ్ చేశారు.
కనీసం రెండు రోజులకోసారి ప్రతి ప్రాంతానికి ట్యాంకర్ ద్వారా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు సకాలంలో తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
#Sidhumaroju
Alwal










