అమర్‌నాథ్‌కు నాంది.|

0
7

“పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్.”

హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ గుహ వార్షిక యాత్రకు సోమవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ప్రథమ పూజతో శ్రీకారం చుట్టారు.

శాస్త్రోక్తంగా జరిగిన ఈ ప్రత్యేక పూజలో ఆలయ పూజారులు, శ్రైన్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో 2026 అమర్‌నాథ్ యాత్రకు అధికారికంగా నాంది పలికినట్లైంది.

జూలై 3 నుంచి భక్తులకు యాత్ర ప్రారంభం కానుండగా, దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఇప్పటికే నమోదు చేసుకుని దర్శనానికి సిద్ధమవుతున్నారు.

ఈసారి యాత్రలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

యాత్ర జరిగే పహల్గామ్, బాల్టాల్ మార్గాలను ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించడంతో భక్తుల కోసం నిర్వహించే హెలికాప్టర్ సేవలను పూర్తిగా రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయంతో వరుసగా రెండో ఏడాది కూడా హెలికాప్టర్ సదుపాయం లేకుండానే యాత్ర కొనసాగనుంది.

యాత్ర మార్గాల వెంట భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఆధునిక నిఘా వ్యవస్థలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. భక్తులు అధికారులు సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాత్ర చేయాలని అధికారులు సూచించారు.

హెలికాప్టర్ సేవలు లేకపోవడంతో భక్తులు సంప్రదాయ పహల్గామ్ లేదా బాల్టాల్ మార్గాల ద్వారా కాలినడకన లేదా గుర్రాలు, పల్లకీలు, పీఠూ సేవలను వినియోగించి పవిత్ర గుహకు చేరుకోవాల్సి ఉంటుంది.

#Sidhumaroju