హైదరాబాద్‌ను చుట్టేసిన పాములు..|

0
1

“జూన్‌లోనే 1,300కుపైగా పాముల రెస్క్యూ.. వర్షాలతో జనావాసాల్లోకి విషసర్పాల ప్రవేశం.”

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ నగరంలో విషసర్పాల సంచారాన్ని పెంచుతున్నాయి.

నగరంలోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, పార్కులు, ఖాళీ స్థలాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కార్యాలయాల పరిసరాల్లో తరచూ పాములు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని స్నేక్ రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.

‘ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ’ వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 1 నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి సుమారు 1,300 పాములను సురక్షితంగా పట్టుకుని అటవీ శాఖ సహకారంతో వాటి సహజ ఆవాసాల్లో వదిలిపెట్టారు.

వీటిలో 500కు పైగా నాగుపాములు, దాదాపు 300 జెర్రిపోతులు ఉండగా, క్రైట్‌లు, రస్సెల్స్ వైపర్‌లు, ఇతర జాతుల పాములు కూడా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి రెస్క్యూ ఘటనలు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

వర్షాల కారణంగా పాముల బొరియల్లో నీరు చేరడంతో అవి ఆశ్రయం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు జూన్, జూలై నెలలు అనేక జాతుల పాముల సంతానోత్పత్తి కాలం కావడంతో గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న పాములు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగర విస్తరణ, ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు, చెట్లు, పొదలు తొలగిపోవడం వల్ల పాముల సహజ ఆవాసాలు క్రమంగా తగ్గిపోవడం కూడా వాటి సంచారానికి మరో కారణంగా భావిస్తున్నారు.

పాము కనిపిస్తే భయంతో దానిని చంపేందుకు ప్రయత్నించవద్దని స్నేక్ రెస్క్యూ నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సమయంలో సురక్షిత దూరంలో ఉండి వెంటనే శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

అలాగే ఇళ్ల పరిసరాల్లో చెత్త, రాళ్ల గుట్టలు, దట్టమైన పొదలు, ఉపయోగంలో లేని సామగ్రిని పేరుకుపోనివ్వకుండా పరిశుభ్రంగా ఉంచితే పాములు చేరే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

#Sidhumaroju