“న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఉన్న షైదా మౌలా లా కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “న్యా వెరా” – మహిళల ఐక్యత, భద్రత, సాధికారత న్యాయ అవగాహనా సదస్సులో దర్శి టీడీపీ ఇన్చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ షేక్ అల్లాబక్షు, దర్శి ఎస్ఐ జి. ఏడుకొండలు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ భద్రత వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణ చట్టాలు, సంబంధిత ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టంపై అవగాహన ప్రతి మహిళకు అవసరమని తెలిపారు.
విద్య, ఉపాధి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే సమాజంలో వారి మాటకు మరింత విలువ ఉంటుందని పేర్కొన్నారు.
అదేవిధంగా మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులు లేదా నేరాలకు గురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకుని తమ హక్కులను ధైర్యంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.










