ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
అనంత భూమి, మార్కాపురం :ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జేసీతో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం ఏపీ ఏఐఎంఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి రైతు యాప్ డౌన్లోడ్ చేసుకుని తమకు కావలసిన ఎరువులను తెచ్చుకోవచ్చునన్నారు.
వ్యాపారులు ఎవరైనా రైతులకు కావలసిన ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, ఎరువులను పక్కదారి పట్టించినా, వివిధ రకాల ఎరువులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని రైతులను ఇబ్బంది పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనివల్ల రైతులు విచక్షణారహితంగా ఎరువులు వాడటం, బ్లాక్ మార్కెటింగ్ తగ్గుతుందన్నారు. యూరియా, డీఏపీ తదితర ఎరువులు అన్నీ కూడా యాప్ ద్వారా ఆర్ఎస్కేలు, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది రైతులు ఉన్నారని, ఇప్పటివరకు 1.17 లక్షల మంది రైతులు యాప్లో తమ వివరాలను నమోదు చేసుకున్నారని చెప్పారు.










