దుండిగల్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బౌరంపేట్లో భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో భారీ వాహనాల కారణంగా ట్రాఫిక్ జటిలంగా మారుతోందని తెలిపారు
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ సంబంధిత అధికారులతో మాట్లాడి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాదయాత్రలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.










