బీజేపీ కొత్త టీమ్‌లో తెలంగాణకు నో ప్లేస్.|

0
3

● గతంలో తెలంగాణకు మూడు కీలక హోదాలు.. ఇప్పుడు ఒక్కరికీ అవకాశం లేదు

● బండి సంజయ్, డీకే అరుణ, కే. లక్ష్మణ్‌లకు గతంలో జాతీయ బాధ్యతలు

● ఏపీకి రెండు కీలక పదవులు.. పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు

హైదరాబాద్, ఆగస్టు 17: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు.

ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు వివిధ మోర్చాలు, మీడియా, సోషల్ మీడియా విభాగాలకు సంబంధించిన కీలక నియామకాలను వెల్లడించారు.

తాజా జాబితాలో తెలంగాణకు చెందిన ఒక్క నాయకుడికీ జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్ హోదా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.

13 మంది ఉపాధ్యక్షుల జాబితాలో తెలంగాణకు చోటు దక్కలేదు.

ఎనిమిది మంది ప్రధాన కార్యదర్శులు, 16 మంది కార్యదర్శుల జాబితాలోనూ రాష్ట్రానికి ప్రాతినిధ్యం కనిపించలేదు.

పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)గా బీఎల్ సంతోష్‌ను కొనసాగించారు. శివప్రకాశ్, సౌదాన్ సింగ్‌లకు సంయుక్త ప్రధాన కార్యదర్శులు (ఆర్గనైజేషన్)గా బాధ్యతలు అప్పగించారు.

ఉపాధ్యక్షులుగా వసుంధర రాజే సింధియా, తిరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయ్ పాండా, డి. పురంధేశ్వరి, రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి, డా. భారతి ప్రవీణ్ పవార్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ప్రొఫెసర్ ఎం. నాగరాజ, ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్, డా. మధుచంద్ర కర్‌లను నియమించారు.

పార్టీకి చెందిన ఏడు ప్రధాన మోర్చాల అధ్యక్షుల జాబితాలోనూ తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు.

యువ మోర్చాకు డా. హేమంగ్ జోషి, మహిళా మోర్చాకు రూప్ కుమారి చౌదరి, ఓబీసీ మోర్చాకు అమర్‌పాల్ మౌర్య, కిసాన్ మోర్చాకు బన్సీలాల్ గుజ్జర్, ఎస్సీ మోర్చాకు శివేశ్ కుమార్ రామ్, ఎస్టీ మోర్చాకు డా. మన్నాలాల్ రావత్, మైనారిటీ మోర్చాకు కున్వర్ బాసిత్ అలీలను నియమించారు.

మీడియా విభాగం కన్వీనర్‌గా అనిల్ బలూనీ, కో-కన్వీనర్లుగా ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారీ, సిద్ధార్థ్ యాదవ్‌లకు బాధ్యతలు అప్పగించారు.

సోషల్ మీడియా కన్వీనర్‌గా దీపక్ మాస్కే, కో-కన్వీనర్లుగా ప్రీతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లను నియమించారు. ఈ రెండు విభాగాల్లోనూ తెలంగాణకు చోటు లభించలేదు.

ఇదిలా ఉండగా, గతంలో తెలంగాణ బీజేపీకి జాతీయ స్థాయిలో మూడు కీలక హోదాలు ఉన్నాయి.

2023లో బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించగా, డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు. అదే సమయంలో కే. లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

అయితే తాజాగా ప్రకటించిన జాబితాలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికీ జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్ హోదా దక్కలేదు.

గతంలో రాష్ట్రానికి లభించిన మూడు కీలక బాధ్యతలకు భిన్నంగా ఇప్పుడు ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రెండు కీలక అవకాశాలు లభించాయి.

ఉపాధ్యక్షుల జాబితాలో డి. పురంధేశ్వరికి స్థానం కల్పించగా, ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్ రెడ్డికి బాధ్యతలు దక్కాయి. దీంతో కొత్త టీమ్‌లో తెలుగు రాష్ట్రాలకు లభించిన ప్రాతినిధ్యంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

#sidhumaroju