ప్రజలే వీఐపీలు.. కంటోన్మెంట్ అభివృద్ధికి ఈటల హామీ.|

0
3

● ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలి: ఈటల రాజేందర్

● మురుగునీటి, వర్షపు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం

● రోడ్లు, పార్కులు, సీసీ కెమెరాలు, పోలీస్ పెట్రోలింగ్‌పై ప్రత్యేక దృష్టి

మేడ్చల్ మల్కాజిగిరి ఆగస్టు 17: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆర్టీసీ కాలనీ, బంజారానగర్‌లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ప్రజావాణి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించి, సంబంధిత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌ను కాలుష్యరహితంగా, సుందరమైన ప్రాంతంగా భావిస్తామని, అయితే ప్రస్తుతం పలు ప్రాంతాలు అపరిశుభ్రతకు గురవుతున్నాయంటూ తనకు పదేపదే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో చర్చించి పరిష్కారం చూపించాలని సూచించారు.

సుమారు మూడున్నర లక్షల జనాభా ఉన్న కంటోన్మెంట్ ప్రాంతానికి సీఈఓతో పాటు పలువురు అధికారులు పనిచేస్తున్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో చొరవ కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత సీఈఓ పనితీరుపై ఇప్పటికే పలుమార్లు తన దృష్టికి తీసుకెళ్లానని, ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని సూచించినట్లు చెప్పారు. చిన్న విస్తీర్ణంలో ఉన్న కంటోన్మెంట్‌లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు.

రోడ్ల విస్తరణ కోసం కంటోన్మెంట్‌లో తీసుకున్న భూమికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం సాధారణంగా కేంద్ర ఖజానాకు జమ అవుతుందని, అయితే తాను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో రూ.305 కోట్లను కంటోన్మెంట్ ఖాతాలో జమ చేయించామని ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నిధులను ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని చెప్పారు.

దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ పైప్‌లైన్లు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని, వాటిని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాలు కురిసినప్పుడు తొలుత నీట మునిగే ప్రాంతాల్లో కంటోన్మెంట్ కూడా ఒకటని పేర్కొంటూ, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా స్ట్రామ్‌వాటర్ డ్రైన్ల నిర్మాణానికి రూ.305 కోట్లను వినియోగిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కంటోన్మెంట్‌కు రావాల్సిన పన్నుల బకాయిలను కూడా ఇప్పించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు.

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోలేనని, తాను బాధ్యతగల ప్రజాప్రతినిధిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలే తనకు వీఐపీలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, తనపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయడం తన బాధ్యత అని పేర్కొన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో రాజకీయ నాయకులకు కీలక బాధ్యత ఉందని అన్నారు.

ప్రజలు అందించిన వినతిపత్రాల్లోని అంశాలపై స్పందిస్తూ కంటోన్మెంట్‌లో పోలీస్ పెట్రోలింగ్ పెంపు, సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కుల పరిశుభ్రత, చౌరస్తాల విస్తరణ, రహదారుల నిర్మాణం, ఓపెన్ జిమ్ ఏర్పాటు వంటి అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యులు నర్మదా మల్లికార్జున్, ప్రశాంత్, నరసింహ, మల్లికార్జున్, వై.వి.రావు తదితరులు పాల్గొన్నారు.