రూ.40 కోట్ల భూమిని కాపాడిన సిపి బి.సుమతి IPS.|

0
3

● రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాత విచారణ

● భూ పత్రాలను పరిశీలించి వృద్ధురాలికి న్యాయం

● కబ్జాకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

ఆల్వాల్, ఆగస్టు 21: రాజకీయ ఒత్తిళ్లను పక్కనబెట్టి బాధితులకు అండగా నిలవడంలో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి IPS తన నిబద్ధతను చాటుకున్నారు.

హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 80 ఏళ్ల వృద్ధురాలికి చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆమె అడ్డుకున్నారు.

తనను ఆశ్రయించిన వృద్ధురాలికి అండగా నిలిచి, ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టారు.

కొంతకాలంగా అక్రమ పత్రాల ఆధారంగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు కొందరు ప్రయత్నించడంతోపాటు, ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బెదిరిస్తూ మానసిక ఆందోళనకు గురిచేసినట్లు సమాచారం.

దీంతో బాధితురాలు తన ఆస్తి పత్రాలతో సీపీ బి. సుమతిని ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరారు.

ఈ భూవివాదంలో నిందితులకు అనుకూలంగా రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, సీపీ బి. సుమతి వాటికి లొంగలేదు.

నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి వయసుతోపాటు ఆమె వద్దనున్న అసలైన భూ పత్రాలను పరిశీలించిన అనంతరం, సదరు భూమి వృద్ధురాలిదేనని నిర్ధారించారు.

వృద్ధురాలి భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ బి. సుమతి స్పష్టం చేశారు.

బాధితురాలి స్థలానికి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులు, అనాథల ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నించే వారు ఎంతటి వారైనా సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తనకు న్యాయం జరిగేలా చొరవ చూపిన సీపీ బి. సుమతికి, మల్కాజ్‌గిరి పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు.

#sidhumaroju

Alwal