● చింతల మాణిక్యరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్కు బయలుదేరిన పార్టీ శ్రేణులు
● పలు కాలనీల ప్రతినిధులు, స్థానికులు భారీగా హాజరు
● 22-A నిషేధిత జాబితా నుంచి కాలనీలను తొలగించాలని డిమాండ్
ఆల్వాల్, సెప్టెంబర్ 5: 22-A నిషేధిత జాబితాలో చేరిన నివాస ప్రాంతాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా దీక్షకు అల్వాల్ నుంచి పార్టీ శ్రేణులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్యరెడ్డి నేతృత్వంలో అల్వాల్ నుంచి బస్సులు, కార్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల ప్రతినిధులు ఇందిరాపార్క్కు బయలుదేరారు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని వేణుగోపాల్నగర్, మంగాపురం కాలనీ, ఆనంద్రావునగర్, జానకీనగర్, వాసవినగర్, రామ్నగర్తో పాటు మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం డివిజన్ల పరిధిలోని పలు కాలనీలకు సంబంధించిన భూములు 22-A జాబితాలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు తెలిపారు.
కొన్ని సర్వే నంబర్లలోని పరిమిత భూభాగాలకు సంబంధించిన సమస్యలను కారణంగా చూపుతూ మొత్తం కాలనీలను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఇళ్ల యజమానులు, స్థిరాస్తి కొనుగోలుదారులు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారు పేర్కొన్నారు.
ముఖ్యంగా పాత అల్వాల్, దమ్మాయిగూడ ప్రాంతంలోని సర్వే నంబర్లు 52, 55కు సంబంధించి హెచ్ఎండబ్ల్యూఎస్ సమస్యలు, రైల్వే, హట్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం మొత్తం ప్రాంతాలపై పడుతోందని ఆరోపించారు.
ఇటీవల మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కూడా పత్రాలు, ఆధారాలతో వచ్చిన 22-A ఫిర్యాదులను పరిశీలించి అర్హత ఉన్న ఆస్తులను జాబితా నుంచి తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, వాస్తవంగా ఎలాంటి వివాదాలు లేని కాలనీలను కూడా సమగ్రంగా పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాలనీ ప్రతినిధులు తమ సమస్యలను ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్వర్మ, డివిజన్ అధ్యక్షులు అజయ్రెడ్డి, కార్తీక్గౌడ్, శ్రీధర్రెడ్డి, మల్లికార్జున్గౌడ్, సుజాత, ఉదయ్ప్రకాశ్, రాజిరెడ్డి, సూర్య, గోపి, లక్ష్మణ్, విజయ్మండ, అనిల్ తదితరులు, పలువురు కాలనీ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.
22-A నిషేధిత జాబితా నుంచి తమ కాలనీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.
#sidhumaroju
Alwal










