● హైదరాబాద్ నుంచి సైబరాబాద్, మల్కాజిగిరికి 1,410 పోస్టుల బదిలీ
● సైబరాబాద్కు 905.. మల్కాజిగిరికి 505 పోస్టులు
● మూడు కమిషనరేట్లలో తుది పోలీసు బలం ఖరారు
ఆల్వాల్, సెప్టెంబరు 4: హైదరాబాద్ నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో సిబ్బంది పోస్టుల పునర్విభజన పూర్తయింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల మధ్య ప్రస్తుతం ఉన్న పోస్టులను అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా కొత్త పోస్టులు మంజూరు చేయకుండా, అందుబాటులో ఉన్న మానవ వనరులను ఆయా ప్రాంతాల శాంతిభద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలకు అనుగుణంగా కేటాయించారు.
ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ నుంచి మొత్తం 1,410 పోస్టులను ఇతర రెండు కమిషనరేట్లకు తరలించారు.
ఇందులో సైబరాబాద్కు 905, మల్కాజిగిరికి 505 పోస్టులు దక్కాయి. దీంతో మూడు విభాగాల్లో సిబ్బంది బలంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది.
పునర్విభజన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్లో 17,991 పోస్టులు, సైబరాబాద్లో 4,931,మల్కాజిగిరిలో 6,804 పోస్టులు అందుబాటులో ఉంటాయి.
పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాలు, ట్రాఫిక్ రద్దీతో పాటు శాంతిభద్రతలకు సంబంధించిన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది పంపిణీలో ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో జనాభా, వాణిజ్య కార్యకలాపాలు, రవాణా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్లకు అదనపు సిబ్బంది అందుబాటులోకి రావడం పోలీసింగ్ సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది.
కొత్త నియామకాలకు అదనపు ఆర్థిక భారం లేకుండా, ఇప్పటికే మంజూరైన పోస్టులను అవసరానికి తగ్గట్టుగా పునఃకేటాయించడం ఈ ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
#sidhumaroju
Alwal










