● 26 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వ కసరత్తు
● ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళిక.. పీడబ్ల్యూసీకి కన్సల్టెన్సీ బాధ్యతలు
● మీడియాతో అనధికారికంగా మాట్లాడొద్దంటూ ఉద్యోగులకు ఆదేశాలు
ఆల్వాల్, సెప్టెంబరు 4: తెలంగాణ విద్యుత్ ప్రసార సంస్థ (ట్రాన్స్కో)లో ప్రభుత్వ ఆధీనంలోని 26 శాతం వాటాను విక్రయించి నిధులు సమీకరించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వ రంగ సంస్థలో రాష్ట్రానికి 100 శాతం వాటా ఉంది. అందులో 26 శాతం భాగాన్ని పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించాలని తెలంగాణ పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించినట్లు వెల్లడైంది.
ఇందుకు అవసరమైన ఆర్థిక, న్యాయపరమైన విధానాలపై సలహాలు అందించేందుకు ప్రైస్ వాటర్హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)ను కన్సల్టెన్సీ సంస్థగా నియమించనున్నట్లు తెలిసింది.
ప్రణాళికలో భాగంగా తొలుత డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) సిద్ధం చేయనున్నారు. ట్రాన్స్కో ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, బాధ్యతలు, కార్యకలాపాలు, మూలధన అవసరాలు, సమీకరించబోయే నిధుల వినియోగం వంటి అంశాలను అందులో పొందుపరచి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి సమర్పించాల్సి ఉంటుంది.
నియంత్రణ సంస్థ అనుమతులు పూర్తయిన తర్వాత ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) నిర్వహించి షేర్లను మార్కెట్లోకి తీసుకురానున్నారు. అనంతరం స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు సుమారు ఏడాది సమయం పట్టవచ్చని అంచనా.
26 శాతం వాటా బయటకు వెళ్లినా ప్రభుత్వానికి 74 శాతం భాగస్వామ్యం మిగులుతుంది. అయితే ఒకసారి పబ్లిక్ ఇష్యూ పూర్తయితే ప్రైవేటు మదుపరులు కూడా కంపెనీలో భాగస్వాములవుతారు. వారి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ ప్రసార సంస్థను మార్కెట్ పరిధిలోకి తీసుకురావడం వల్ల భవిష్యత్ నిర్వహణపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న చర్చ మొదలైంది. ప్రతిపాదన విజయవంతమైతే జెన్కోలోనూ ఇలాంటి విధానాన్ని అనుసరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో ట్రాన్స్కోకు కీలక బాధ్యతలు ఉన్నాయి. 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ స్థాయిల్లోని సబ్స్టేషన్లు, ఈహెచ్టీ లైన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణతో పాటు విద్యుత్ ప్రసార వ్యవస్థను పర్యవేక్షిస్తోంది.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 400 కేవీ సబ్స్టేషన్లు 29, 220 కేవీ కేంద్రాలు 107, 132 కేవీ కేంద్రాలు 337 ఉన్నాయి. సుమారు 31,420 సర్క్యూట్ కిలోమీటర్ల ఈహెచ్టీ లైన్లు, 1,184 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 43,848 ఎంవీఏ ప్రసార సామర్థ్యం ఉన్నట్లు తాజా నివేదిక పేర్కొంది.
ఇదే సమయంలో సంస్థలోని అంతర్గత అంశాలు బయటకు వెళ్లకుండా ఉద్యోగులకు ఆదేశాలు జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారులు, సిబ్బంది, ఆర్టిజన్లు అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడరాదని ఆగస్టు 21న సర్క్యులర్ విడుదల చేసినట్లు తెలిసింది.
అధికారిక లేదా అంతర్గత వివరాలను అనధికారికంగా వెల్లడించినా, సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్యాంటీన్లు, కారిడార్లు, లిఫ్టులు, వెయిటింగ్ ఏరియాలు, ప్రజా రవాణా, సామాజిక సమావేశాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ సున్నితమైన అంశాలపై చర్చించకూడదని సూచించారు.
ఈ ఆదేశాలను ట్రాన్స్కో డైరెక్టర్ (హెచ్ఆర్)ఓరుగంటి శ్రీనివాసులు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది.
ప్రభుత్వ రంగంలోని కీలక విద్యుత్ ప్రసార సంస్థకు తొలిసారిగా పబ్లిక్ ఇష్యూ ద్వారా పెట్టుబడులు సమీకరించే ప్రతిపాదన తెరపైకి రావడంతో విద్యుత్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అయితే డీఆర్హెచ్పీ, సెబీ పరిశీలన, ఐపీవో, లిస్టింగ్ వంటి దశలు పూర్తయిన తర్వాతే తుది రూపురేఖలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
#sidhumaroju
Alwal










