హైదరాబాద్ : నగరంలోని చిలకలగూడలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ హత్య కేసును చిలకలగూడ పోలీసులు ఛేదించారు.
ప్రేమ వ్యవహారంపై ఏర్పడిన విభేదాలే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మే 7 రాత్రి చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రానగర్ కాలనీలో అఖిల్పై కత్తులతో దాడి జరిగింది. మెడతో పాటు శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
బాధితుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణతో విచారణను వేగవంతం చేసిన పోలీసులు, హత్య వెనుక ప్రేమ వ్యవహారం కారణమని గుర్తించారు.
యువతితో అఖిల్ సన్నిహితంగా ఉండడాన్ని వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లు విచారణలో తేలింది.
ఘటనకు నాలుగు నుంచి ఐదు రోజుల ముందే నిందితులు మెడిబావిలో సమావేశమై అఖిల్ను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి కదలికలపై నిఘా ఉంచి, సరైన సమయం చూసి దాడికి దిగినట్లు తెలిపారు.
ఈ కేసులో అల్లబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి, రాజం పరమేశ్ కుమార్ యాదవ్, రాజం వంశీ కృష్ణ అలియాస్ రాఖీ, రాజం మనీష్ అలియాస్ బిచ్చు సహా మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు జువెనైల్గా ఉన్నట్లు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితుడు సాయి కిరణ్పై ఇప్పటికే చిలకలగూడ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక ఘటన అనంతరం నగరంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
చిలకలగూడ ఏసీపీ కె. శశాంక్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
డీసీపీ రక్షిత కృష్ణమూర్తి విడుదల చేసిన ప్రకటనలో, ప్రతీకార దాడులు, ఆస్తుల ధ్వంసం, నిందితుల కుటుంబ సభ్యులను బెదిరించడం వంటి చర్యలను కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, విద్వేషపూరిత ప్రచారం, తప్పుడు రెచ్చగొట్టే పోస్టులు, విద్వేషపూరిత ప్రచారం, తప్పుడు సమాచారంపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎవరినైనా ఉపేక్షించబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
#Sidhumaroju










