“డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. బయటపడిన వందల కోట్ల ఆస్తులు!”

0
47

హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలు, కార్యాలయాలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ, హైదరాబాద్‌తో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టింది.

ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తులు, విలువైన పత్రాలు, భూములకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం.

శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో ఆర్డీవోగా పనిచేసిన సమయంలో వంశీమోహన్ ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపూర్ ప్రాంతాల్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

ఆ భూములను తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బదిలీ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

అలాగే ఒక రియల్టర్ నుంచి పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో పొందిన అంశం కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

సోదాల్లో గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ వందల కోట్ల రూపాయలకు చేరవచ్చని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ప్రస్తుతం కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

#sidhumaroju