మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచే లక్ష్యంతో మల్కాజిగిరి ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ పరిధిలోని బొల్లారం చెక్పోస్ట్ వద్ద నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను ప్రారంభించారు.
ఈ బస్ షెల్టర్ను ట్రాఫిక్ తిరుమలగిరి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. శంకర్ రాజు ప్రారంభించారు.
ఇప్పటి వరకు బస్సులు ప్రయాణికులను ఎక్కించడం, దింపడం కోసం ప్రధాన రహదారిపైనే నిలిచేవి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పాటు రహదారిని వినియోగించే ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
అలాగే బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు ఎండ, వర్షం వంటి వాతావరణ పరిస్థితుల ప్రభావానికి గురవుతూ అసౌకర్యానికి లోనయ్యేవారు. ఈ సమస్యలకు పరిష్కారంగా బొల్లారం చెక్పోస్ట్ వద్ద బస్ షెల్టర్ను ఏర్పాటు చేశారు.
ఏసీపీ జి. శంకర్ రాజు, ఎస్ఐ ఉగేందర్, ఏఎస్ఐ రెడ్డి నాయక్, పీసీ రవికాంత్, మొబైల్ ఆఫీసర్ పీసీ సాయి, హెచ్జీ శ్రీనివాస్ రెడ్డి, హెచ్జీ మహేష్ నాయక్లతో పాటు స్థానిక ప్రజల సహకారంతో ఈ బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టారు.
ఈ సౌకర్యం ద్వారా బస్సులు ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా సురక్షితంగా నిలిచే అవకాశం ఏర్పడగా, ప్రయాణికులు కూడా సౌకర్యవంతంగా వేచి ఉండేందుకు అనుకూలమైన వసతి అందుబాటులోకి వచ్చింది.
అదే సందర్భంగా వేసవి కాలంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు బస్ షెల్టర్ పక్కనే చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు.
ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు మురళి యాదవ్, లాల్బజార్ ప్రాంత నాయకుడు బాలరాజు నాయక్ సహకారం అందించారు.
ఈ సందర్భంగా ఏసీపీ జి. శంకర్ రాజు మాట్లాడుతూ ప్రజల సౌకర్యం, రహదారి భద్రతను పెంపొందించే కార్యక్రమాల్లో భాగస్వాములైన ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక ప్రజలను అభినందించారు.
ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే ఇటువంటి కార్యక్రమాలు ట్రాఫిక్ క్రమశిక్షణను మెరుగుపరచడంతో పాటు ప్రజా సంక్షేమం, రహదారి భద్రతను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
#Sidhumaroju
Alwal










