“కన్నెపల్లి నుంచి నీటి తరలింపుపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచన.. రిటైర్డ్ ఇంజనీర్లకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్”
హైదరాబాద్ జులై 13: “కరువు వర్సెస్ కాళేశ్వరం – కన్నెపల్లి నుంచి నీటి తరలింపు సాధ్యమా?” అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్య, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
రిటైర్డ్ ఇంజనీర్లపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని పేర్కొన్న ఈటల, వారిపై చేసిన వ్యాఖ్యలకు సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
2023లో లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనపై బాధ్యులెవరో గుర్తించి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు లేదా పాలకుల నిర్లక్ష్యం నిరూపితమైతే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎస్ఆర్ఎస్పీ, ఎల్ఎండీ వంటి ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించినప్పటికీ, ఆశించిన స్థాయిలో నీరు అందలేదని ఈటల పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పంటలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించామని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికను ప్రభుత్వం ఏకపక్షంగా వ్యాఖ్యానిస్తోందని ఆరోపించిన ఆయన, కన్నెపల్లి వద్ద ప్రవహిస్తున్న నీటిని ఎత్తిపోసి రైతులకు అందించే అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి గ్రౌటింగ్ పనులు జరిగిన విషయాన్ని కూడా ఎన్డీఎస్ఏ నివేదిక ప్రస్తావించిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, రైతులు పత్తి విత్తనాలకు బిందెలతో నీరు పోసే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రాజకీయ విమర్శలకు బదులుగా నీటి నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ, జెన్కో విద్యుత్ కేంద్రాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పెద్ద మొత్తంలో నీరు కేటాయించాల్సిన పరిస్థితి ఉందని, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రజలు బోర్ల కోసం తనను ఆశ్రయిస్తున్నారని ఈటల పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడే భాష ప్రజాస్వామ్యానికి తగిన విధంగా ఉండాలని, వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
#Sidhumaroju










