గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్న ఈ పవిత్ర వేళ, ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రార్థించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు. అమ్మవారిపై అచంచల విశ్వాసంతో సమర్పించే ప్రతి బోనం, ప్రతి ప్రార్థన ప్రజల జీవితాల్లో సిరిసంపదలు, సంతోషం, ధైర్యం, విజయాలను నింపాలని ఆకాంక్షించారు.
శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారి అనుగ్రహం సకల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.










