న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో అణుశక్తి శాఖ (Department of Atomic Energy) అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశ ఇంధన భద్రత, అణుశక్తి ఉత్పత్తి విస్తరణ, స్వదేశీ అణు సాంకేతికత, పరిశోధన, అణు విద్యుత్ కేంద్రాల సామర్థ్య పెంపు, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ ఇంధన అవసరాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, భారత్ను ఇంధన రంగంలో ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దడంలో అణుశక్తి అత్యంత కీలకమైన రంగమని అన్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
అణుశక్తి రంగంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, పరిశోధనా సంస్థల బలోపేతం, అత్యున్నత భద్రతా ప్రమాణాల అమలుపై నిరంతరం దృష్టి సారించాలని సమావేశంలో సూచించినట్లు తెలిపారు,దేశ అభివృద్ధి, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకొని అణుశక్తి రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్లమెంటరీ కమిటీ తన సూచనలు అందిస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.










