ఇంటింటి సర్వేకు నేటితో తెర.. డిజిటల్ నమోదులో హైదరాబాద్ వెనుకబాటు.|

0
5

● 3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తి

● రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల కంప్యూటరీకరణ 78.14 శాతం

● 94.30 శాతంతో యాదాద్రి భువనగిరి అగ్రస్థానం.. హైదరాబాద్‌లో 58.58 శాతమే

హైదరాబాద్, ఆగస్టు 10: తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision–SIR 2026) లో ఇంటింటి సర్వేకు నేటితో గడువు ముగియనుంది.

బూత్ స్థాయి అధికారులు (BLOs) క్షేత్రస్థాయిలో సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల (EFs) వివరాలను కంప్యూటర్లలో నమోదు చేసే కార్యక్రమం కొనసాగుతోంది.

తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) కార్యాలయం విడుదల చేసిన ఆగస్టు 9 సాయంత్రం 6 గంటల గణాంకాల ప్రకారం..

రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించిన EFs పంపిణీ 100 శాతం పూర్తయింది. ఇప్పటివరకు 2,64,30,494 ఫారాల వివరాలు డిజిటలైజ్ కాగా, మొత్తం పురోగతి 78.14 శాతానికి చేరింది.

జిల్లాల వారీగా చూస్తే 94.30 శాతంతో యాదాద్రి భువనగిరి మొదటి స్థానంలో నిలిచింది. జంగాం 91.69 శాతం, మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతం, జగిత్యాల 89.60 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రాష్ట్రంలో అత్యధికంగా 47,36,669 మంది ఓటర్లు ఉన్న హైదరాబాద్‌లో మాత్రం ఇప్పటివరకు 58.58 శాతం వివరాలే డిజిటల్ నమోదుకు నోచుకున్నాయి.

మేడ్చల్ మల్కాజ్‌గిరి 63.82 శాతం, రంగారెడ్డి 64.91 శాతంతో రాష్ట్ర సగటు కంటే తక్కువ పురోగతిని నమోదు చేశాయి.

ఇంటింటి సర్వే గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో మిగిలిన వివరాల కంప్యూటరీకరణను వేగవంతం చేసి, నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

#Sidhumaroju