ఆసిఫాబాద్‌లో గంజాయి తోటలపై పోలీసుల దాడి |

0
0

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల జీర్లగాట్, గుట్టగూడ గ్రామ శివార్లలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యవసాయ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న 460 గంజాయి మొక్కలను మూడు వేర్వేరు కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అక్రమ సాగుకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను (జీర్లగాట్ గ్రామానికి చెందిన ముగ్గురు, గుట్టగూడకు చెందిన ఒకరు) పోలీసులు అదుపులోకి తీసుకుని, చట్టపరమైన కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగుపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్పీ భరోసా ఇచ్చారు.