నమ్మకమే పెట్టుబడి.. 48 తులాల బంగారం మాయం.|

0
4

● ఆనంద్‌బాగ్ ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ

● రెండు ఫ్లాట్ల నుంచి సుమారు 48 తులాల బంగారం అపహరణ

● ఏప్రిల్‌లో అకస్మాత్తుగా వెళ్లిపోయిన నేపాలీ కుటుంబంపై అనుమానం

ఆల్వాల్, సెప్టెంబర్ 6: ఏళ్ల తరబడి అపార్ట్‌మెంట్‌లో ఉంటూ వాసుల నమ్మకాన్ని పొందిన నేపాలీ కుటుంబం అకస్మాత్తుగా వెళ్లిపోయిన తర్వాత భారీ బంగారం చోరీ వెలుగులోకి వచ్చింది.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆనంద్‌బాగ్ ఎస్‌బీఐ అపార్ట్‌మెంట్‌లోని 301, 302 ఫ్లాట్ల నుంచి సుమారు 48 తులాల బంగారం మాయమైనట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

సదరు కుటుంబం దాదాపు 11 ఏళ్లుగా అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ అక్కడే నివసించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన భార్య నలుగురు పిల్లలతో కలిసి వాచ్‌మన్ బాధ్యతలు కొనసాగించినట్లు సమాచారం.

దీర్ఘకాలంగా అక్కడే ఉండటంతో అపార్ట్‌మెంట్ వాసులతో వారికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ కుటుంబం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది.

అనంతరం అనుమానం వచ్చిన బాధితులు తమ ఇళ్లలోని లాకర్లను పరిశీలించగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. రెండు ఫ్లాట్ల నుంచి కలిపి సుమారు 48 తులాల బంగారం మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబం ఎక్కడికి వెళ్లింది, బంగారం ఆచూకీ ఏమిటి, ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో విచారణ సాగుతోంది.

అనుమానితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం.

#sidhumaroju

Alwal