కుటుంబంతో కలిసిన యూరప్ పర్యటనకు వెళ్లనున్న జగన్
15 రోజుల పర్యటనకు సమ్మతి తెలిపిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు
ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను ఇవ్వాలని కోర్టు ఆదేశం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన విదేశీ పర్యటనకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుటుంబ సమేతంగా యూరప్లోని తన కుమార్తెల వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, 15 రోజుల పర్యటనకు సమ్మతి తెలిపింది.
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం… అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీల మధ్య 15 రోజుల వ్యవధిలో జగన్ యూరప్ పర్యటనను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పర్యటనకు బయల్దేరే ముందు సమగ్ర ప్రయాణ ప్రణాళికను కోర్టుకు, సీబీఐ అధికారులకు సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. విదేశీ పర్యటనలో అందుబాటులో ఉండే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను దర్యాప్తు సంస్థకు తప్పనిసరిగా అందించాలని కోర్టు కీలక షరతులు విధించింది.










