రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
కొటికలపూడిలో పట్టాదారు పాసుబుక్స్ పంపిణీ.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 04/04/2026.
ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ద్వారా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని కొటికలపూడి గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రాజముద్రతో ఉన్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోందన్నారు. తప్పులను సరిదిద్ది భూవివాదాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ కర్తవ్యం అని వివరించారు.
పట్టాదారు పాస్ పుస్తకాల కోసం ఒకప్పుడు రైతులే అధికారులు చుట్టూ తిరిగేవారు. పాస్ పుస్తకం వస్తే రైతులకు అదో వరం. ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వం వద్ద సంప్రదింపులు జరిపి పాస్ పుస్తకాలు మంజూరు చేసేలా గట్టి ప్రయత్నాలు చేసేవారు. అటువంటిది ఇప్పుడు అధికారులే పట్టాదారు పుస్తకాలు ఇస్తామంటూ రైతులు చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడున్నాసరే సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ కెవైసీ చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పారదర్శక పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, తదితరులు పాల్గొన్నారు.










