ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ మైక్రో ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ మోసం ఆరోపణలు ముదురుతున్నాయి. అడ్వకేట్ సుబ్బారావు బాధితుల తరపున పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా మోసం జరిగిందని, ఇందులో మంగ్లీ తన సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకుని ప్రజలను నమ్మించారని ఆయన ఆరోపించారు. మంగ్లీ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, ఇది తనను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నమని ఎదురు ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా బాధితులు నేరుగా మీడియా ముందుకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేయడంతో మంగ్లీకి ఇబ్బందులు తప్పేలా లేవు. పోలీసులు ప్రస్తుతం ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.ప్రముఖ సింగర్ మంగ్లీ , అడ్వకేట్ సుబ్బారావు మధ్య సాగుతున్న వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
రోజుకో ట్విస్టుతో సాగుతున్న ఈ కేసులో తాజాగా బాధితుల ఎంట్రీతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అడ్వకేట్ సుబ్బారావు ఈ కేసును పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు మంగ్లీ టీమ్కు షాక్ ఇస్తున్నాయి.మొదట అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ‘గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. సుమారు 150 మంది బాధితుల నుంచి రూ. 10 కోట్లకు పైగా వసూలు చేశారని, దీని వెనుక మంగ్లీ, ఆమె సోదరుడు శివ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే మంగ్లీ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఏ పాపం తెలియదని, సుబ్బారావు కేవలం పబ్లిసిటీ కోసం తనను వాడుకుంటున్నాడని వాదించారు. అయితే ఈ వాదనను తిప్పికొడుతూ సుబ్బారావు బాధితులను నేరుగా మీడియా ముందుకు తీసుకొచ్చారు. బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటూ, తాము సామాన్య గృహిణులమని, నెట్వర్క్ మార్కెటింగ్ పేరుతో మధు అనే వ్యక్తి ద్వారా ఈ పెట్టుబడి మోసంలో చిక్కుకున్నామని తెలిపారు. 5 శాతం లాభం ఇస్తామని నమ్మించి తమ నుండి లక్షలాది రూపాయలు వసూలు చేశారని, ఆ డబ్బు తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంగ్లీ సోదరిని వివాహం చేసుకోబోయే వ్యక్తి ద్వారానే ఈ ఇన్వెస్ట్మెంట్ వివరాలు తమకు తెలిశాయని వారు పేర్కొనడం గమనార్హం.










