పోలవరం జిల్లా చింతూరు మండలం మామిళ్ళగూడెం గ్రామం ఇప్పుడు కిడ్నీ వ్యాధుల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. గత పదేళ్లుగా ఈ గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నా, ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేకపోవడం, భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయికి చేరిన మూలకాల వల్లనే కిడ్నీలు దెబ్బతింటున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
చికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు చేయలేక, నిరుపేద గిరిజనులు మృత్యువుకు చేరువవుతున్నారు.ఎన్నికల సమయం రాగానే రాజకీయ నాయకులు గ్రామానికి క్యూ కడతారు. “మీ సమస్య మా బాధ్యత.. సురక్షితమైన తాగునీరు అందిస్తాం, మెరుగైన వైద్యం కల్పిస్తాం” అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కానీ గెలిచిన తర్వాత ఏ ఒక్కరూ ఈ గ్రామం వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. నాయకుల హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి తప్ప, సామాన్యుడి ఆరోగ్యానికి భరోసా దక్కడం లేదు.తమ గ్రామంలో ఇంకా ఎంతమంది బలి కావాలని బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్ నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పాలకులు ఇప్పటికైనా తమ మొద్దు నిద్ర వీడి, మామిళ్ళగూడెం ప్రజల ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.
# Yadagiri










