మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన బి. సుమతి ఐపీఎస్, మహిళల భద్రత పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంటూ నిర్వహించిన సాహసోపేతమైన ఆపరేషన్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సాధారణ మహిళలు ఎదుర్కొనే వేధింపులను స్వయంగా అనుభవించి, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు ఆమె అర్ధరాత్రి వేళ ఒంటరిగా రంగంలోకి దిగారు.
ముఖానికి మాస్క్ ధరించి, సామాన్య మహిళలా మే 6వ తేదీ తెల్లవారుజామున దిల్సుఖ్నగర్ బస్టాండ్కు చేరుకున్న ఆమెను చూసి, అక్కడున్న ఆకతాయిలు ఆమె ఒక ఉన్నతాధికారి అని ఏమాత్రం ఊహించలేకపోయారు.
సుమారు మూడు గంటల పాటు ఆమె అక్కడే నిలబడగా, సుమారు 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టి అసభ్యకరమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు.
ఆమెను ఒక సాధారణ మహిళగా భావించి అవమానకరమైన రీతిలో, వారు చేసిన అసభ్య వ్యాఖ్యలు సమాజంలో మహిళల పట్ల ఉన్న దుస్థితిని కళ్ళకు కట్టాయి.
ఈ క్రమంలో పెట్రోలింగ్ పోలీసుల గస్తీ ఎలా ఉందో కూడా ఆమె గమనించారు. సుదీర్ఘ సమయం పాటు ఆమె అక్కడ వేచి ఉన్నా ఒక్క పెట్రోలింగ్ వాహనం కూడా అటువైపు రాకపోవడం గమనార్హం.
పరిస్థితి ముదురుతుండటంతో సీపీ సుమతి తన బృందానికి సైగ చేయగా, మారువేషంలో ఉన్న పోలీసులు వెంటనే స్పందించి నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో అధిక శాతం మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు ఉండటం, చాలా మంది మద్యం మత్తులో ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది.
పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించిన ఆమె, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కూడా కఠినంగా వ్యవహరించారు.
మల్కాజిగిరి కమిషనరేట్ తొలి మహిళా సీపీగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆమె చేసిన ఈ ఆపరేషన్ పోకిరీల గుండెల్లో వణుకు పుట్టించింది.
#Sidhumaroju
Alwal









