🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ వద్ద శనివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, కౌన్సిలర్ చిలువూరు వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య రోడ్లను స్వయంగా తనిఖీ చేశారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం, మళ్లీ వర్షం పడినా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అంజయ్యకు, మున్సిపల్ సిబ్బందికి చైర్మన్, వైస్ చైర్మన్ సూచించారు. అలాగే వర్షాల సీజన్ దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మున్సిపల్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










