మద్యం షాపుల రెన్యూవల్: ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సిందేనన్న హైకోర్టు.

0
1

ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) రుసుము వివాదంపై హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించి, లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దుకాణ యజమానులను ఆదేశించింది. దరఖాస్తులకు సెప్టెంబర్ 21 ఆఖరి తేదీ కావడంతో ఈ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రెన్యూవల్ ఫీజు తుది మొత్తం ఈ కేసులో వెలువడే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్లు విజయం సాధిస్తే, వారు చెల్లించిన అదనపు మొత్తాన్ని భవిష్యత్ లావాదేవీలలో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ప్రస్తుతానికి నోటిఫై చేసిన ఫీజునే చెల్లించాలని సూచించింది.