వేములవాడ రూరల్: మండలం హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు విద్యా ఫలితాల్లో తమ సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పాఠశాలకు చెందిన విద్యార్థినులు అత్యుత్తమ మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.
ఎనిమిదో తరగతి చదువుతున్న బొల్లారం గ్రామానికి చెందిన బుర్ర తపస్వి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ఆరో తరగతికి చెందిన హన్మాజిపేట విద్యార్థిని కోడం స్ఫూర్తి పాఠశాలలో ద్వితీయ స్థానాన్ని, అలాగే తన తరగతిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. “ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటుకు ఏమాత్రం తీసిపోరని ఈ ఫలితాలు నిరూపించాయని క్రమశిక్షణ, నిరంతర కృషితో చదివితే ఏదైనా సాధించవచ్చని తపస్వి, స్ఫూర్తి నిరూపించారన్నారు . ఇతర విద్యార్థులు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి” అని పిలుపునిచ్చారు.
తమ పిల్లల ప్రతిభ పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు తోటి విద్యార్థులు పాల్గొన్నారు.










